తెలుగు జాతికి నిలువెత్తు సంతకం ఎవరు అంటే ఎవరైనా ఎన్టీఆర్ పేరు చెప్పాల్సిందే.ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడి పార్టీని ఏర్పాటు చేయడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్దే.
నటుడిగా తెలుగు తెరపై, రాజకీయ నాయకుడిగా తెలుగు రాష్ట్రాలపై ఆయన చేరగని ముద్ర వేసుకున్నారు.సీఎంగా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు.
దేశమంతా సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తున్నారంటే దాని వెనుక ఉన్నది ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు.రూపాయికే కిలో బియ్యం, పేదలకు ఇల్లు, తిండి, బట్ట అంటూ ఎన్నో కార్యక్రమాలను ఆనాడు టీడీపీ అమలు చేసింది.
అందుకే ఎన్టీఆర్ అంటే తెలుగు వారి పౌరుషంగా అభివర్ణిస్తారు.అప్పటి వరకు మద్రాసీలుగా పిలవబడుతున్న తెలుగు వారికి ప్రత్యేక ఉనికిని తెచ్చిపెట్టడంతో పాటు ఢిల్లీ పీఠానికి తెలుగువారి సత్తా చాటిన ఘనాపాటి ఎన్టీఆర్.
మే 28న ఎన్టీఆర్ జయంతి.ఈ ఏడాదితో ఎన్టీఆర్ తెలుగు గడ్డపై పుట్టి 100 ఏళ్లు నిండబోతున్నాయి.1923 మే 28న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో పుట్టిన ఎన్టీఆర్… 1996 జనవరి 18న తుదిశ్వాస విడిచారు.తెలుగు జాతికి నిలువెత్తు ఆస్తిగా నిలిచిన ఎన్టీఆర్ను ఇప్పుడు పార్టీకతీతంగా గౌరవించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను టీడీపీ అధికారికంగా నిర్వహిస్తోంది.ఆయన వారసుడు బాలకృష్ణ ఈ వేడుకలను నిమ్మకూరులో ప్రారంభించనున్నారు.
అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్, తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఎందుకంటే తెలుగు జాతికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా అధికారికంగా నిర్వహించడం సముచితం.
ఎన్టీఆర్తో జగన్కు ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా ఆయన అంటే అభిమానం ఉంది.సందర్భం వచ్చిన ప్రతీసారి ఎన్టీఆర్కు జగన్ సముచిత గౌరవం ఇస్తున్నారు.ఇటీవల జిల్లాల విభజన సందర్భంగా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి తన రాజనీతిని చాటుకున్నారు.ఇప్పుడు శతజయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తే జగన్ మరింత గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
అటు తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎన్టీఆర్తో ఎంతో అనుబంధం ఉంది.కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించినా ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి ఉన్నత స్థాయికి ఎదిగారు.ఇటీవల కాంగ్రెస్ మహానేత పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏడాది పాటు నిర్వహించి తనకు పార్టీల భేదం లేదని కేసీఆర్ నిరూపించుకున్నారు.మరి అదే తరహాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తారో లేదో చూడాలి.
ఏదేమైనా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల సీఎంలు అధికారికంగా నిర్వహిస్తే మహానాయకుడికి అదే గొప్ప నివాళి అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
.