తెలంగాణ ప్రభుత్వం తన విధానాలతో కొత్త పుంతలు తొక్కుతోంది.రాష్ట్రంలో ఎవరికి లేని విచిత్ర నిబంధనలు ప్రభుత్వ టీచర్లకు విధించింది.
టీచర్లు ఆస్తులు కొనాలన్నీ, అమ్మాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.అలాగే ఏటా ఆస్తుల సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలి.
రాజకీయ నాయకులు ఎన్నికల నామినేషన్ల సమయంలో సమర్పించే ఆస్తుల వివరాలు సరైనవేనా? వారికున్న ఆస్తులన్నీ ఎన్నికల సంఘానికి కరెక్ట్ గా తెలియచేస్తున్నారా? వందల, వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారో ఎన్నడైనా ప్రజలకు చెబుతున్నారా? కాని ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తుల వివరాలు ప్రతి ఏటా ప్రభుత్వానికి తెలియచేయాలంట.తమకున్న ఆస్తి అమ్ముకోవాలన్నా లేక ఏదైనా భూమి, ఇల్లు వంటిది కొనుక్కోవాలన్నా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలంట.
దీనికి సంబంధించి ఈ నెల 21న జీవో జారీ చేశారు.వాస్తవానికి 8వ తేదీనే జీవో తయారైనా 21న ఆమోదించినట్లుగా అందులో ఉంది.పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఈ జీవోను పంపించారు.అత్యంత ముఖ్యమైన అంశంగా దీన్ని పరిగణించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం.
రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఎవరికీ ఎటువంటి నిబంధనలు లేవు.కాని టీచర్లకు మాత్రమే ఇలాంటి నిబంధనలు విధించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి.నల్గొండ జిల్లాలోని ఒక స్కూల్ హెడ్ మాస్టర్ విధులకు సరిగా హాజరు కాకుండా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని, రియల్ ఎస్టేట్ సెటిల్ మెంట్స్ చేస్తున్నాడని ఆరోపణలు రావడంతో ఈ విధమైన ఆంక్షలు విధిస్తున్నట్లుగా కూడా జీవోలో వివరణ ఇచ్చుకుంది ప్రభుత్వం.
ముఖ్యంగా రెవిన్యూ, పోలీస్, మున్సిపల్, విద్యుత్ వంటి శాఖల్లో పనిచేసేవారు బహిరంగంగానే ప్రజలను దోచుకుంటున్నారు.వారి మీద వందల సంఖ్యలో ఏసీబీ కేసులు నడుస్తున్నాయి.
అయితే ఆయా శాఖల్లో పనిచేసే సిబ్భందికి ఇటువంటి ఆంక్షలు లేవు.కాని ప్రభుత్వ టీచర్లకు మాత్రమే ఆస్తుల అమ్మకం, కొనుగోళ్ళకు సంబంధించి ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఉపాధ్యాయులు అవినీతికి పాల్పడే అవకాశమే లేదు.తమను ఎందుకిలా వేధిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.