మన హిందూ పురాణాల ప్రకారం గరుత్మంతుడు అనగా గ్రద్దకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.గరుత్మంతుడిని శ్రీమహావిష్ణువు వాహనంగా చెబుతారు.
గరుత్మంతుడు ఎంతో బల శాలి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మహావిష్ణువు గరుడారూధుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.అయితే మన దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీరాముడు, శ్రీకృష్ణ ఆలయాలు ఒకే చోట ఉన్నాయి.
అయితే శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి వేర్వేరు ధ్వజ స్తంభాలు ఉండటం విశేషం.ఈ ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడి విగ్రహం ఉంది.
ఈ విగ్రహం నుంచి నిత్యం కళ్ల నుంచి నీరు బొట్లు బొట్లుగా పడుతూ ఉంటుంది.ఈ విధంగా గరుత్మంతుడి కళ్ల నుంచి నీరు రావడానికి గల కారణం హనుమంతుడు అని చెబుతారు.
గరుత్మంతుడి కళ్ళ నుంచి నీరు రావడానికి హనుమంతుడు ఏ విధంగా కారణం అయ్యాడో ఇక్కడ తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు అనే గ్రామంలో అళగుమల్లరి కృష్ణస్వామి ఆలయం ఉంది.
ఈ ఆలయంలో జాంబవతి, సత్యభామ సమేత శ్రీ కృష్ణ పరమాత్ముడు కొలువై ఉన్నాడు.ఈ విధంగా మన దేశంలో శ్రీకృష్ణ ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం అని చెప్పవచ్చు.
ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న గరుత్మంతుడి విగ్రహం నుంచి నీరు కారడం ఈ ఆలయం ప్రత్యేకత.పురాణాల ప్రకారం ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు జాంబవంతుడుకి శ్రీరామచంద్రునిగా దర్శనం కల్పించారు.
ఈ క్రమంలోనే శ్రీరామచంద్రుడు హనుమంతుని పిలుచుకు రావాల్సిందిగా గరుత్మంతుడిని ఆదేశిస్తాడు.
ఈ సమయంలో హనుమంతుడు శ్రీరామచంద్రుడి కోసం తపస్సు చేస్తుండగా గరుత్మంతుడు అక్కడికి వెళ్లి తానే గొప్ప బలశాలి అనే గర్వంతో హనుమంతుని తపస్సుకి బంగం కలిగిస్తాడు.ఈ విధంగా శ్రీ రామనామస్మరనానికి భంగం కలగడంతో హనుమంతుడు గరుత్మంతుడి పై చేయి చేసుకుంటాడు.అప్పటివరకు తానే బలవంతుడనే భావనలో ఉన్న గరుత్మంతుడు ఆంజనేయుని దెబ్బకు ఎంతో బలహీనుడని భావించి హనుమంతుడిని అనుసరించి ఈ ఆలయానికి చేరుకుంటాడు.
అందుకే ఈ క్షేత్రంలో ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఒక చెంప వాచినట్టు, గరుత్మంతుడి కళ్ళలో నుంచి నిత్యం నీరు బొట్లు బొట్లుగా కింద పడుతున్నట్టు ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.