ఎవరెన్ని చెప్పినా.ఎన్ని విమర్శలు వచ్చినా తను పెట్టుకున్న కట్టుబాట్లను, నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ వస్తోంది సింగపూర్.
నేరాలు, శిక్షల అమలు విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ వుంటుంది.చిన్న నేరం చేసినా.
దాని వల్ల సమాజంపై పడే ప్రభావాన్ని బట్టి అక్కడ శిక్షలు వుంటాయి.ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా విషయంలో మాత్రం కఠినంగా వుంటుంది.
ఏకంగా ఉరిశిక్షను సైతం అమలు చేయడానికి వెనుకాడదు.ఈ ఏడాది ఏప్రిల్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి నేరం రుజువు కావడంతో భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కే ధర్మలింగాన్ని సింగపూర్ ప్రభుత్వం ఉరితీసిన సంగతి తెలిసిందే.
మానసిక పరిస్ధితి బాగోలేదని.క్షమాభిక్ష పెట్టాలని నాగేంద్రన్ కుటుంబ సభ్యులు, అంతర్జాతీయ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సింగపూర్ ఏమాత్రం పట్టించుకోలేదు.
తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అన్నట్లుగా ముందుకే వెళ్లింది.
తాజాగా మరోసారి అదే డ్రగ్స్ కేసులో మరో భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉరి తీసింది సింగపూర్ ప్రభుత్వం.
మాదక ద్రవ్యాల సరఫరా కేసులో దోషులుగా తేలిన భారత సంతతికి చెందిన మలేషియన్ పౌరుడు కల్వంత్ సింగ్ (32), సింగపూర్ జాతీయుడైన నోరాషరి గౌస్ (48)లను గురువారం ఉరితీశారు.కల్వంత్ సింగ్ను ఉరి నుంచి తప్పించేందుకు చివరి నిమిషంలో చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
2013లో కల్వంత్ సింగ్, 60.15 గ్రాముల డైమార్ఫిన్తో సహా మొత్తం 120.9 గ్రాముల మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నాడనే అభియోగం కింద అరెస్ట్ చేశారు.దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం 2016లో కల్వంత్ సింగ్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.
ఈ క్రమంలో కోర్టు అతనికి ఈ ఏడాది జూన్ 30న ఉరిశిక్షను విధించింది.దీనిని జూలై 7న అమలు చేయాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.అయితే ఉరిని అడ్డుకునేందుకు మానవ హక్కుల కార్యకర్తల బృందం మలేషియాలోని కౌలాలంపూర్ లో వున్న సింగపూర్ హైకమీషన్ కార్యాలయం ముందు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది.కానీ వీరి ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు.
గురువారం సింగపూర్ లోని చాంగీ జైలులో కల్వంత్ సింగ్, గౌస్ లను ఉరి తీశారు.