అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరానికి బుధవారం రోజు 47-అడుగుల పొడవైన ఒక భారీ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చింది.దీన్ని చూసిన స్థానికులు షాక్ అయ్యారు.
విషయం తెలుసుకున్న ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ పరిశోధన సంస్థ తిమింగలం మృతికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించారు.ఇందులో భాగంగా తిమింగలం పొట్టకోసి చూస్తే. అందులో ప్లాస్టిక్ వస్తువులు కనిపించాయి.చేపల వలలు, తాళ్లు, ప్లాస్టిక్ బ్యాగులు భారీ సంఖ్యలో కనిపించాయి.దీంతో పరిశోధన సంస్థ ఒక్కసారిగా షాక్ అయ్యింది.మనుషులు చేసే పనుల వల్ల సముద్ర జీవులు ఎలా చనిపోతున్నాయో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అనే పరిశోధనా సంస్థ అధికారులు స్థానికులకు తెలియజేశారు.
ప్లాస్టిక్ వ్యర్థాల వల్లే ఈ మగ తిమింగలం మృతి చెందిందని తెలుసుకొని స్థానికులు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు.కడుపులో చెత్త పేరుకుపోవడంతో తిమింగలం ఆహారం తీసుకోలేకపోయింది.
అందుకే అది మరణించి ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాలు, నదులు ఉన్న ప్రదేశంలో పారవేయకూడదని ప్రజలకు సూచించారు.
మనషులు చేసే పనుల వల్ల మూగజీవాలు మృత్యువాత పడటం చాలా బాధాకరమన్నారు.
సముద్ర జీవుల మరణానికి కారణమయ్యే ప్లాస్టిక్ వ్యర్ధాలను నీటిలో పారేయకుండా అన్ని దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఇప్పుడు చనిపోయిన తిమింగలాల జాతి అంతరించిపోయే జీవుల జాబితాలో ఉంది.మనుషులు ఇప్పటికైనా తమ అలవాట్లను మార్చుకోక పోతే ఇలాంటి జీవులు చరిత్ర పుస్తకాల్లో తప్ప బయట కనిపించే అవకాశం లేదు.
తాజా వార్తలు