ప్రస్తుత స్మార్ట్ యుగంలో ఇంటర్నెట్ అత్యంత కీలకం.పెరుగుతున్న జనాభా, ఇంటర్నెట్పై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో అందరికీ వేగవంతమైన డేటా అందడం లేదు.
దీనిని పెంచేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.అంతరాయం లేని ఇంటర్నెట్ వేగవంతంగా, నాణ్యతతో కూడిన సేవలందించే దిశగా ఇంటర్నెట్ ప్రొవైడర్లు సైతం శ్రీకారం చుట్టారు.
ఈ కోవలోనే ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మనదేశంలోనూ పలు కంపెనీలు ఇప్పటికే 5జీ ట్రయల్స్ మొదలుపెట్టాయి.
ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియా 5 జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.చైనా కూడా ఇటీవలే దీన్ని ప్రారంభించింది.అలాగే 5జీ టెక్నాలజీపై పరిశోధన, అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. 5జీ ద్వారా పట్టణ ప్రాంతాల్లో సెకనుకు 10,000 ఎంబీలు, గ్రామీణ ప్రాంతాల్లో 1000 ఎంబీల వేగంతో సేవలను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.ఇక్కడ పరిస్ధితి ఇలా వుంటే.అమెరికాలో మాత్రం 5జీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
5జీ సేవలను ఎయిర్పోర్టుల వద్ద వినియోగించవద్దు అని ఆ దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి.విమానాశ్రయాల వద్ద 5జీని వాడటం వల్ల.విమాన ప్రయాణ, రవాణా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతుందని ఆ సంస్థల సీఈవోలు తెలిపారు.ఈ నేపథ్యంలోనే వైట్హౌస్కు లేఖ రాశారు.రన్వేలకు 2 కిలోమీటర్ల దూరం వరకు 5జీ వద్దు అని ఆ లేఖలో వాళ్లు కోరారు.లేఖ రాసిన వారిలో యూపీఎస్ ఎయిర్లైన్స్, అలస్కా ఎయిర్, అట్లాస్ ఎయిర్, జెట్బ్లూ ఎయిర్వేస్, ఫెడ్ఎక్స్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి.
5జీ ఏర్పాటు కోసం ఏటీ అండ్ టీతో పాటు వెరిజాన్ సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.దేశంలో సుమారు 48 విమానాశ్రయాల వద్ద ట్రాన్స్పాండర్ల ఏర్పాటుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది.వాస్తవానికి జనవరి 19వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 5జీ అందుబాటులోకి రావాల్సి ఉంది.
అయితే ఎయిర్లైన్స్ సంస్థల ఆందోళనలతో 5జీ అమలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.