తమ దేశంలో కోవిడ్ వ్యాప్తికి విదేశీ వస్తువుల్ని తాకడమే కారణమని ఉత్తర కొరియా అంటోంది.సరిహద్దుల వెంట వచ్చే గాలి, వాతావరణం, బెలూన్ల పట్ల… విదేశీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తమ దేశ ప్రజల్ని ఉత్తర కొరియా హెచ్చరించింది.
విదేశీ వస్తువులు తాకడం వల్లే తమవద్ద మొదటి కరోనా కేసులు నమోదయ్యాయని పరోక్షంగా దక్షిణ కొరియానుద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.
దేశ ఆగ్నేయ దిక్కున ఉన్న కుమ్గాంగ్ పర్వత ప్రాంతంలోని ప్రజలు గుర్తుతెలియని వస్తువులను తాకడం వల్ల 18 ఏళ్ల సైనికుడు, ఐదేళ్ల చిన్నారికి జ్వరం లక్షణాలు కనిపించాయని ఉత్తర కొరియా పేర్కొంది.
ఆ తర్వాత వారికి కరోనా పాజిటివ్గా తేలిందని తెలిపింది.అక్కడి ఇఫోరి ప్రాంతం నుంచి ఏప్రిల్ మధ్యలో రాజధానికి వచ్చిన అనేక మందికి జ్వరం వచ్చినట్లు గుర్తించామని తెలిపింది.
వారి రాకతో దేశంలో అనూహ్యంగా కేసులు పెరిగాయని వెల్లడించింది.
కరోనాను కట్టడి చేసే లక్ష్యంతో 2020 నుంచి ఉత్తర కొరియా తమ దేశ సరిహద్దుల వెంట కఠిన ఆంక్షలు అమలు చేసింది.
రెండేళ్ల పాటు ఒక్క కేసూ రాలేదన్న ఆ దేశం.ఈ ఏడాది మే నెలలో మొదటి కేసు నమోదైనట్టు ప్రకటించింది.
తమ దేశంలో వైద్య సదుపాయాలు, తగిన టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో ఆ జ్వరం కోవిడ్ అని గుర్తించలేకపోయామని ఆ దేశ వైద్య నిపుణులు తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటివరకూ ఆ దేశంలో 40 లక్షలకుపైగా ప్రజలు జ్వరం బారినపడ్డారు.వారిలో ఎక్కువ భాగం కోవిడ్ బారిన పడినట్టు అనుమానాలున్నాయి.అయితే, అమెరికా ఆరోగ్య సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.
ప్రజలు కలుషితమైన ఉపరితలాలు, వస్తువులను తాకడం వల్ల కరోనా బారినపడే ప్రమాదం తక్కువే.మరోవైపు ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది.దాంతో ఓ దేశంపై మరో దేశం ఆరోపణలు సర్వసాధారణమేనన్న అభిప్రాయముంది.