విదేశాల నుంచి స్వీకరించే విరాళాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారతీయులకు తీపి కబురు చెప్పింది.ప్రభుత్వానికి తెలియజేయకుండా ఇకపై విదేశాలలో వుంటున్న బంధువుల నుంచి భారతీయులు ఏడాదికి రూ.10 లక్షల వరకు స్వీకరించవచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ మేరకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి కొన్ని సవరణలు చేసింది.
అంతేకాదు.ఈ నిధుల స్వీకరణకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు గతంలో వున్న 30 రోజుల గడువును 90 రోజులకు పెంచింది.
Foreign Contribution (Regulation) Rules, 2011లోని నిబంధన 6లో వున్న ‘లక్ష రూపాయలు’ పదాల స్థానంలో ‘10 లక్షల రూపాయలు’, ‘ 30 రోజులు’ అనే పదాల స్థానంలో ‘3 నెలలు) అనే పదాలను చేర్చుతామని గెజిట్ నోటిఫికేషన్ లో తెలిపింది.దీనితో పాటు విదేశీ నిధులను స్వీకరించేందుకు ‘రిజిస్ట్రేషన్’ , ‘ముందస్తు అనుమతి’కి సంబంధించి దరఖాస్తు పత్రంలోని నిబంధన 9లోనూ మార్పులు చేసింది కేంద్రం.
సంస్థలు, వ్యక్తులు, లేదా ఎన్జీవోలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా గురించి హోంశాఖకు తెలియజేయడానికి 45 రోజుల సమయం ఇచ్చింది.అలాగే బ్యాంక్ ఖాతా, పేరు, చిరునామా మార్చినా.
అలాగే సంస్థలలోని మెంబర్స్ విదేశీ నిధులను స్వీకరిస్తే దానిని తెలియజేయడానికి హోం శాఖ గతంలో వున్న 15 రోజుల గడువుకు బదులు 45 రోజుల సమయాన్ని ఇచ్చింది.
కాగా.ఈ ఏడాది ఆరంభంలో దేశంలోని దాదాపు 6 వేల స్వచ్చంధ సంస్థలు (ఎన్జీవోలు) విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయిన సంగతి తెలిసిందే.ఇందులో ఐఐటీ ఢీల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం వంటి ప్రఖ్యాత సంస్థలు వున్నాయి.
దేశంలో 2021, డిసెంబర్ 31 నాటికి 22,762 ఎఫ్సీఆర్ఏ నమోదిత ఎన్జీవోలు ఉన్నాయి.వీటిలో కొన్ని సంస్థలు లైసెన్సు కోసం తిరిగి దరఖాస్తు చేసుకోలేదు.దరఖాస్తు చేసుకోనివి, దరఖాస్తును కేంద్రం తిరస్కరించినవి కలిపి మొత్తం 5,933 ఎన్జీవోలు లైసెన్సును కోల్పోయినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది.వీటితో కలిపి గత ఏడాది మొత్తంగా 12 వేలకు పైగా ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలు పొందే లైసెన్సును కోల్పోయాయి.
కేంద్రం నిర్ణయంతో 2022, జనవరి 1 నాటికి విదేశీ విరాళాల లైసెన్సు కలిగిన సంస్థలు 16,829 మాత్రమే వున్నాయి.కేంద్రం కఠిన నిర్ణయంతో వీటిలో కొన్ని సంస్థలు లైసెన్స్ రెన్యూవల్ చేసుకున్నాయి.