దేశవ్యాప్తంగా పట్టు పెంచుకునేందుకు బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.ఒక్కో రాష్ట్రంలో పట్టు సాధిస్తూ, మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు చూస్తోంది.
ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బిజెపి పాగా వేసింది.అలాగే త్వరలో జరగనున్న గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్, మేఘాలయ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజెపి అనేక రాజకీయ వ్యూహాలకు తెరతీసింది.
దీనిలో భాగంగానే కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.ఇక తెలంగాణలో రెండు రోజుల పాటు బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు భారీగా చేశారు. ఈ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన బిజెపి పాలితం ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర కీలక నాయకులు హైదరాబాద్ కు రానున్నారు.ఇప్పటికే కొంతమంది హైదరాబాదుకు చేరుకున్నారు.
ఈ సమావేశాల్లో పార్టీని మరింత బలోపేతం ఏ విధంగా చేయాలి , బిజెపిని జాతీయస్థాయిలో తిరుగులేకుండా చేయాలంటే ఏం చేయాలి ? రాబోయే ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలు అమలుచేయాలి ఇలా అనేక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
2024 లో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా చేసేందుకు అవసరమైన అన్ని కీలక నిర్ణయాలను ఈ సమావేశాల్లో తీసుకోబోతున్నారు.ఇప్పటికే కేంద్రంలో బిజెపి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడడం, బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది.ప్రస్తుతం తెలంగాణలో బిజెపి రోజురోజుకు బలపడుతున్న క్రమంలో మరింత ఫోకస్ ఈ రాష్ట్రంపై పెట్టాలని బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.
ఈ కార్యవర్గ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
.