తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.అంతకుముందు అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ భేటీలో బండి సంజయ్తో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్చుగ్, మాజీ ఎంపీ డీకే అరుణ, విజయశాంతి, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో నిత్యం పార్టీని ఏదో ఒక విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నేతలకు అమిత్ షా హితబోధ చేశారు.
బండి సంజయ్ పాదయాత్ర ఎలా సాగిందని.ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.మండు వేసవిలోనూ 400 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన బండి సంజయ్ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు.అయితే పాదయాత్రలు కాకుండా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలని ఆయన సూచించారు.
పార్టీలో కొత్తగా చేరే వారికి భరోసా కల్పించాలని.నేతలంతా కలిసికట్టుగా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధ్యమవుతుందని అమిత్ షా వివరించారు.
ఈ సమావేశం వేదికగా బీజేపీపై టీఆర్ఎస్ నేతలు చేసే విమర్శలను తిప్పికొట్టాలని అమిత్ షా పిలుపునిచ్చారు.ముఖ్యంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదన్న వాదనకు గట్టి కౌంటర్ ఇవ్వాలని సూచించారు.అటు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఆశావహుల పేర్ల జాబితాను బీజేపీ నేతలు అమిత్ షాకు సమర్పించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని బీజేపీ నేతలకు అమిత్ షా కితాబిచ్చారు.
కాగా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ… వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు.కేసీఆర్ సర్కారును గద్దె దించితేనే రజాకార్ల పాలనకు శుభం కార్డు పడుతుందని.అయితే కేసీఆర్ సర్కారును పడగొట్టాలంటే తాను తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని.బండి సంజయ్ ఒక్కడు చాలని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.నీళ్లు, నిధులు, నియామకాలను సాధిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ హామీలను తుంగలో తొక్కారని అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.